ఇంటర్ కాలేజీ విద్యార్థులకు రేవంత్ సర్కార్ గుడ్‌న్యూస్.. సిద్ధమవుతున్న ప్రతిపాదనలు, త్వరలోనే అమలు

తెలంగాణ ఇంటర్ విద్యార్థులకు గుడ్‌న్యూస్ చెప్పేందుకు రేవంత్ సర్కార్ రెడీ అయింది. రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లోనూ మధ్యాహ్న భోజన పథకం అమలు చేయాలని సర్కారు భావిస్తోంది. ప్రస్తుతం స్కూళ్లలో మిడ్‌డే మీల్స్ అందిస్తుండగా.. ఇంటర్ కాలేజీల్లోనూ అమలు చేయాలని యోచిస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశాల మేరకు ఇంటర్‌ విద్యాశాఖ ప్రతిపాదనలు రెడీ చేస్తోంది. సర్కార్ నుంచి ఆమోదం లభిస్తే వచ్చే విద్యా సంవత్సరం (2025-26) నుంచి ఇంటర్ కాలేజీల్లోనూ మధ్యాహ్న భోజన పథకం అమలు చేయనున్నారు.

తెలంగాణ వ్యాప్తంగా 425 గవర్నమెంట్ జూనియర్‌ కాలేజీలు ఉండగా.. అందులో సుమారు 1.70 లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఈ కాలేజీలన్నీ కూడా దాదాపుగా నియోజకవర్గ, మండల కేంద్రాల్లోనే ఉన్నాయి. దీంతో స్టూడెంట్స్ కాలేజీలకు దూరప్రాంతాల నుంచి రాకపోకలు సాగించాల్సిన పరిస్థితి ఉంది. ఉదయాన్నే భోజనం తెచ్చుకునే వీల్లేని చాలా మంది విద్యార్థులు.. ఆకలితో కాలేజీ సమయం కంటే ముందే ఇళ్లకు వెళ్లిపోతున్నారు. ఈ పరిస్థితి కారణంగా ఇంటర్ కాలేజీల్లో డ్రాపౌట్లు పెరిగిపోతున్నాయి. చాలా కాలేజీల్లో అటండెన్స్ 50 శాతానికి మించడం లేదని విద్యాశాఖ అధికారులు గుర్తించారు.

ఈ సమస్యల నివారణకు రేవంత్ సర్కార్ సిద్ధమైంది. స్కూళ్లలో మాదిరిగా ఇంటర్ కాలేజీల్లోనూ మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయాలని భావిస్తోంది. ఈ పథకం అమలుపై త్వరలోనే ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పిస్తామని ఇంటర్‌ విద్యాశాఖ డైరెక్టర్‌ వెల్లడించారు. రానున్న బడ్జెట్‌లో ఈ పథకానికి సర్కార్ నిధులు కేటాయించే ఛాన్స్ ఉందని ఆయన తెలిపారు. అందుకనుగుణంగానే వారం రోజుల్లో ప్రతిపాదనలు సమర్పించనున్నట్లు చెప్పారు. ఒక్కో విద్యార్థిపై పూటకు రూ.20 నుంచి రూ.25 వరకు ఖర్చవుతుందని అంచనా వేస్తుండగా.. అందుకు ప్రతి ఏడాది రూ.100- 120 కోట్లు అవసరమవుతాయని భావిస్తున్నారు.

గవర్నమెంట్ జూనియర్, డిగ్రీ కళాశాలలతోపాటు పాలిటెక్నిక్‌, బీఈడీ, డీఈడీ కాలేజీల్లో మొత్తం 3.91 లక్షల మందికి మధ్యాహ్న భోజనం అమలు చేయాలని గత ప్రభుత్వం 2018లో నిర్ణయించింది. అక్షయ పాత్ర ఫౌండేషన్‌ ద్వారా అమలు చేయాలని అప్పటి ప్రభుత్వం భావించింది. ఈ మేరకు 2018-19 విద్యా సంవత్సరంలో ఆగస్టు 15న పథకాన్ని ప్రారంభించాలని భావించినా.. అమలుకు నోచుకోలేదు. మళ్లీ 2020-21 విద్యా సంవత్సరంలో అమలు చేయాలనుకున్న సాధ్యం కాలేదు. ఈ నేపత్యంలో రానున్న విద్యా సంవత్సరం నుంచి పథకాన్ని కచ్చితంగా అమలు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తోంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button