Chhattisgarh Encounter: ఛత్తీస్‌గఢ్‌లో మరో భారీ ఎన్‌కౌంటర్‌.. 14 మంది నక్సలైట్లు మృతి

ఛత్తీస్‌గఢ్‌-ఒడిశా సరిహద్దులో జనవరి 19 రాత్రి భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. నిన్న ఇద్దరు మావోల మృతదేహాలు లభ్యమవగా.. మంగళవారం ఉదయం గరియాబంద్‌ జిల్లాలో జరిగిన ఎదురుకాల్పుల్లో మరో 12 మంది మావోయిస్టులు మృతి చెందారు. పలుమార్లు జరిగిన ఈ ఎన్‌కౌంటర్‌లో మృతిచెందిన మావోయిస్టుల సంఖ్య 14కి చేరిందని పోలీసులు వెల్లడించారు..

ఛత్తీస్‌గఢ్‌, జనవరి 21: ఛత్తీస్‌గఢ్‌, ఒరిస్సా సరిహద్దు ప్రాంతంలో భారీ నక్సలైట్‌ ఎన్‌కౌంటర్‌ జరిగింది. పోలీసులు, మావోల మధ్యా ఎదురు కాల్పులు జరిగాయి. ఈ క్రమంలో ఇద్దరు మహిళా మావోయిస్టులు సహా మొత్తం 14 మంది నక్సలైట్లు మృతి చెందారు. ఎన్‌కౌంటర్ తర్వాత 1 SLR సహా భారీ మొత్తంలో పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నట్లు పోలీస్‌ వర్గాలు తెలిపాయి. ఒరిస్సా యాంటీ నక్సల్ ఫోర్స్(SOG), ఛత్తీస్‌గఢ్ పోలీసులు, జిల్లా రిజర్వ్ గార్డ్ (డిఆర్‌జి), సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సిఆర్‌పిఎఫ్), ఛత్తీస్‌గఢ్‌కు చెందిన కోబ్రా సంయుక్త భద్రతా సిబ్బంది ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నారు.

కేంద్ర సరిహద్దు జిల్లాలైన గరియాబంద్‌, నౌపాడలో ఛత్తీస్‌గఢ్‌, ఒడిశా పోలీసులు, సీఆర్‌పీఎఫ్ సిబ్బంది కలిసి ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించాయి. ఈక్రమంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో సోమవారం ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. ఈ తెల్లవారుజామున గాలింపులో మరో 12 మంది మృతదేహాలు లభ్యమయ్యాయి. దీంతో మృతుల సంఖ్య 14కు చేరింది. కాల్పుల్లో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాల్పుల అనంతరం భారీస్థాయిలో ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం ఈ ప్రాంతంలో సెర్చ్‌ ఆపరేషన్ కొనసాగుతుంది. ఈ ఆపరేషన్‌లో వెయ్యికి పైగా భద్రతా సిబ్బంది పాల్గొన్నట్లు సమాచారం.

ఎన్‌కౌంటర్‌లో కీలక నేతలు మృతి చెందారు. మృతుల్లో కేంద్ర కమిటీ సభ్యులు చలపతి అలియాస్ రామచంద్రారెడ్డి, మనోజ్‌, స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు గుడ్డు కూడా ఉన్నారు. చిత్తూరు జిల్లాకు చెందిన చలపతి అలియాస్ రామచంద్రారెడ్డిపై ప్రభుత్వం గతంలో రూ.కోటి రివార్డు ప్రకటించింది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button