Beti Bachao Beti Padhao: నేటితో ‘బేటీ బచావో, బేటీ పఢావో’ పథకానికి పదేళ్లు పూర్తి.. ప్రధాని మోదీ భావోద్వేగ ట్వీట్ వైరల్

2015 జనవరిలో ప్రారంభించిన ‘బేటీ బచావో, బేటీ పఢావో’ కార్యక్రమం నేటితో పదేళ్లు పూర్తి చేసుకుంది. ఆడపిల్లల లింగ నిష్పత్తి, సాధికారతను సాధించడమే లక్యంగా ప్రారంభమైన ఈ పథకం గత పదేళ్ల కాలంలో గణనీయమైన పురోగతి సాధించిందని ఈ సందర్భంగా ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. ప్రజలందరి సహకారం వల్లనే ఇది సాధ్యమైందని కృతజ్ఞతలు తెలిపారు..
న్యూఢిల్లీ, జనవరి 22: ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించిన ‘బేటీ బచావో, బేటీ పఢావో’ కార్యక్రమం నేటితో పదేళ్లు పూర్తి చేసుకుంది. ఈ విషయాన్ని గుర్తు చేస్తూ ప్రధాని నరేంద్ర మోడీ బుధవారం సోషల్ మీడియా వేదికగా కృతజ్ఞతలు తెలిపారు. ‘నేటితో బేటీ బచావో, బేటీ పఢావో ఉద్యమానికి పదేళ్లు పూర్తవుతాయి. గత దశాబ్ద కాలంలో ఇది ఒక కీలక పరివర్తన, ప్రజల-ఆధారిత చొరవగా మారింది. అన్ని వర్గాల భాగస్వామ్యాన్ని పొందిందని’ ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా పోస్ట్ చేస్తూ ఆనందం వ్యక్తం చేశారు. లింగ అడ్డంకులు, పక్షపాతాలను అధిగమించడంపై ఈ ఉద్యమం దృష్టి సారించిందని, ఆడపిల్లలకు విద్య, అవకాశాలు ఉండేలా చూసేందుకు ఈ కార్యక్రమం మార్గం సుగమం చేసిందని ప్రధాని మోదీ అన్నారు. ఆడ పిల్లల లింగ నిష్పత్తులను సమతుల్యం చేయడం కోసం ప్రజలతోపాటు వివిధ కమ్యూనిటీ సంస్థలు చేపట్టిన ప్రయత్నాలకు, అంకిత భావానికి ప్రధాని మోదీ కృతజ్ఞతలు తెలిపారు.
ప్రస్తుతం పిల్లల లింగ నిష్పత్తి తక్కువగా ఉన్న జిల్లాలు గణనీయమైన మెరుగుదలను సాధించాయని, అవగాహన ప్రచారాలు లింగ సమానత్వం, ప్రాముఖ్యతను తెలియజేయడంలో హితోదికంగా తోడ్పడ్డాయన్నారు. దేశంలోని మహిళల హక్కులను కాపాడేందుకు, వారి విద్యకు భరోసా కల్పించేందుకు ఈ ఉద్యమాన్ని కొనసాగించాల్సిన అవసరం ఉందని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ‘ఈ ఉద్యమాన్ని కింది స్థాయి నుంచి ఉధృతం చేసిన భాగస్వాములందరినీ అభినందిస్తున్నానన్నారు. మన కుమార్తెల హక్కులను పరిరక్షించడాన్ని కొనసాగిద్దాం, వారి విద్యను నిర్ధారిద్దాం. కలిసికట్టుగా వారి కోసం ఎటువంటి వివక్ష లేకుండా అభివృద్ధి చెందగల సమాజాన్ని సృష్టిద్దాం. రాబోయే రోజుల్లో మన దేశ కుమార్తెలకు గొప్ప పురోగతిని, అవకాశాలను వస్తాయ్’ అని మోదీ అన్నారు.



